కొండపై వెలసిన రంగనాథస్వామి ప్రతి రూపకంగా కొండ దిగువున గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కనే నిర్మించిన స్వామి వారి ఆలయం ఎత్తుగా నిర్మించిన ఆలయ ప్రధాన గోపురం మరియు దేవాలయంలోని విశాలమైన ప్రాంగణం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది
దక్షినాభిముఖంగా ఉన్న ఈ ఆలయం ముఖమండపం, గర్భాలయాను కలిగివుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీ రంగనాథస్వామి శేషతల్పంపై శయనించి, భక్తులపై చల్లని చూపులను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తారు. స్వామి వారి చరణముల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చొని ఉంటారు. స్వామి వారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ దేవుడిని, స్వామివారి ముందు వైపు గల ఉత్సవ విగ్రహాలను దర్శించుకోవచ్చు, ఇక్కడ స్వామి వారికి " మాణిక్య రంగనాథస్వామి " అని పేరు.
పవిత్రమైన హృదయాలతో స్వామి వారిని సేవిస్తే కోరికలన్నీ తీరుతాయని, పాపాలు నివారించబడి అనంతమైన పుణ్యాలు సిద్ధిస్తాయని, పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.